India-Maldives: మాల్దీవుల్లో ముయిజ్జు మళ్లీ గెలవడంపై స్పందించిన భారత్

  • కొంతకాలంగా మాల్దీవులు, భారత్ మధ్య స్పర్ధలు
  • ఇటీవల మాల్దీవుల ఎన్నికల్లో అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విజయం
  • మాల్దీవులతో సంబంధాలు సజావుగా కొనసాగుతాయని భారత్ ఆశాభావం 
India reacts on Muizzu victory in Maldives elections

గత కొంతకాలంగా భారత్-మాల్దీవుల సంబంధాలు ఏమంత సజావుగా లేవన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల మాల్దీవుల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దేశాధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి అధికార పీఠంపై కొలువుదీరనున్నారు. 

దీనిపై భారత్ ఆచితూచి స్పందించింది. పార్లమెంటు ఎన్నికలు విజయవంతంగా జరుపుకున్న మాల్దీవులకు భారత్ నుంచి అభినందనలు తెలుపుతున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటన చేశారు. 

గత కొంతకాలంగా, కొన్ని అంశాలపై ఇరు దేశాల మధ్య పార్లమెంటు స్థాయిలో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, మాల్దీవుల్లో కొలువుదీరనున్న కొత్త పార్లమెంటుతోనూ సంప్రదింపులు జరపడంపై ఆశాభావంతో ఉన్నామని పేర్కొన్నారు. 

భారత్, మాల్దీవుల మధ్య సుదీర్ఘ, చారిత్రక సంబంధాలు ఉన్నాయని, మాల్దీవులతో కలిసి అనేక అభివృద్ధి, సహకార కార్యక్రమాలు చేపడుతున్నామని జైస్వాల్ వివరించారు.

More Telugu News